మైసూరులో నెలకొనివున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం
శ్రీ చాముండేశ్వరీ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటైన మైసూరు నగరానికి తూర్పున సుమారు 12 కి.మి.ల దూరంలో గల చాముండీ పర్వతంపై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఈ నగరాన్నే క్రౌంచపురి, క్రౌంచ పట్టణం, క్రౌంచ పీఠంగా పిలుస్తుంటారు.
పురాణ ప్రాశస్థం:
పూర్వం మహిషపురిగా పిలవబడే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. ఈ రాక్షసుడు పరమశివుడిని తన కఠోర తపస్సుతో మెప్పించి, లోకంలోని ఏ పురుషుడి చేతిలో మరణించకుండా వుండేలా వరం పొందాడు. మహిషాసురుడుని వధించుటకై శ్రీ చాముండేశ్వరీ దేవి శక్తి స్వరూపిణిగా అవతరించి, మహిషాసురుని సంహరించి మహిషాసురమర్ధినిగా ప్రసిద్ధమైనది.
శక్తి పీఠం:
హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయంలో సతీ దేవి ప్రాణ త్యాగం చేసినప్పుడు, పరమ శివుడు ఆమె శరీరాన్ని తన భుజాన వేసుకొని రుద్రతాండవం చేశాడు. ఆ సమయంలో విష్ణు దేవుడు తన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించగా, ఆ శరీర బాగాలు దేశంలోని పద్దెనిమిది ప్రాంతాలలో పడి ఆ ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్దిగాంచాయి. వాటిలో నాల్గవ శక్తి పీఠమే శ్రీ చాముండేశ్వరీ క్షేత్రం. ఈ పీఠంపై సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు.
ఆలయ ప్రాశస్థం:
ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆలయ గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర రాజ పాలకులు నిర్మించారు. హోయసల, విజయ నగర రాజ వంశీయుల ఏలుబడిలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చెందింది. వారి తరువాత కాలంలో మైసూరుని పాలించిన రాజులు ముఖ్యంగా ముస్లిం పాలకులైన హైదర్ ఆలీ, వారి కుమారుడు టిప్పు సుల్తాన్లు అమ్మవారికి అనేక ఆభరణాలను కానుకలుగా సమర్పించారు.
వారి తదనంతరం స్ఠానిక ఒడయారు రాజులు ఈ దేవాలయాన్ని అత్యంత సుందమైన ఆలయంగా రూపొందించారు. వీరు శ్రీ చాముండేశ్వరీ దేవిని కులధైవంగా పూజించేవారు. అద్భుత శిల్ప, వాస్తు శిల్ప కళలకు సుందర తార్కాణంగా అలరారుతున్న ఈ ఆలయము ఒడయారు రాజుల కళాపోషణకు ప్రతీకగా పేర్కొనవచ్చు. ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గాలి గోపురం ఏడు అంతస్థులతో సుమారు నలభై అడుగుల ఎత్తుతో ఆకాశాన్నంటున్నట్లు కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం వెండి తొడుగుతో నిర్మింపబడి వుంటుంది. దీనిపై అమ్మవారి పౌరాణిక గాధా చిత్రాలతో కూడి ఆలయ వైభవాన్ని చాటుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శివునికి, వినాయకునికి, ఆంజనేయ స్వామికి ఉపాలయాలు ఉన్నాయి. ఆలయం వెలుపల ఒక చేతిలో కత్తి మరొక చేతిలో పడగ విప్పిన పాముతో మహిషాసురిని విగ్రహం కలదు.
అమ్మవారి అభరణాలు:
శ్రీ చాముండేశ్వరీ దేవి అమ్మ వారికి ధరింపజేసే ఆభరణాలు చాలా విలువైనవని చెపుతారు. దసరా పండుగల సందర్బంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ ఆభరణాలను అమ్మవారికి అలంకరించి ఆ తరువాత తిరిగి ఖజానాకు తరలిస్తారు. అమ్మవారికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని ఒడయార్ రాజు తన వద్ద ఉంచుకొని, దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అమ్మవారికి సంబంధించిన విలువైన ఆభరణాలలో చామరాజ ముడి (కిరీటం) కర్ణపత్రం, డాలు, మూడు పతకాలు, కాసుల హారం, పచ్చల పతకాలు, నాగడం, జడ బిళ్ళ, జడ సరాలు వంటివి ప్రభుత్వ ఆధీనంలో వుండగా, వజ్ర కచతమైన త్రిశూలం, పాశుపతాస్ర్తం, కవచం, నాగస్రం, ఢమరుకం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలు స్ఠానిక ఒడయారు రాజుల ఆధీనంలో ఉన్నాయి. ఈ విశేషాఅభరణాలన్నింటిని మూలవిరాట్టుకు కాకుండా ఉత్సవ మూర్తికి మాత్రమే అలంకరిస్తారు.
వెల కట్టలేని పచ్చల హారం:
అమ్మవారి ఆభరణాలలో గల పచ్చల హారం ప్రత్యేకమైనది. గతంలో ముమ్మడి కృష్ణ ఒడియార్ దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరగగా, “మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే వచ్చే డబ్బు కూడా ఈ పచ్చల హారానికి సరిపోదని” బెంగుళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి ఒకరు అభిప్రాయపడ్డారని తెలుస్తుంది.
దసరా ఉత్సవాలు:
మైసూరు నగరంలో జరిగే దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్దిగాంచినవి. ఈ ఉత్సవాలను పది రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్బంగా ఒడయారు రాజుల కులదైవం అయిన శ్రీ చాముండేశ్వరీ దేవిని వివిధ ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. ఈ దసరా ఉత్సవాల సమయంలో మైసూరు ప్రజలే కాక, దేశ విదేశాల నుండి ప్రజలు మైసూరుకు వచ్చి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు.
మూడో అతి పెద్ద నంది:
ఆలయానికి వెళ్ళే నడక మార్గంలో 800వ మెట్టు దగ్గర గల శివాలయం ముందు ఒక పెద్ద నంది విగ్రహం కలదు. గ్రానైట్తో చెక్కబడిన ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తుతో మరియు 24 అడుగుల పొడవుతో దేశంలో కల అతి పెద్ద నంది విగ్రహాలలో మూడో అతి పెద్ద నంది విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చెక్కబడిన గంటలు చాలా అందంగా అకర్షిస్తాయి.
సందర్శన సమయం:
ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు మరియు సాయింత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి?
రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే మైసూరు నగరం అనుసంధానించబడి ఉన్నది. మైసూరు నుంచి కొండ పైకి వెళ్ళుటకు బస్సు మరియు ప్రయివేట్ వాహన సౌకర్యం కలదు. 1659 సంవత్సరంలో వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. కాలి నడకన మెట్లు ఎక్కి కొండ పైకి చేరుకోవచ్చు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి