ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం
ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపంలో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరంలో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరంలో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరంలో నెలకొని ఉంది.
పురాణ ప్రాశస్థం:
పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతంలో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు.
చారిత్రక ప్రాశస్థం:
ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రంలో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరంలో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మంత్ర శక్తితో ఆ ఓడలోని ప్రయాణికులను కాపాడెను. అందుకు కృతఙతగా ఆ ఓడలోని నావికుడు ఒక గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. ఆ గోపీచందనం మట్టిని తొలగించగా, చిన్ని కృష్ణుని విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.
ప్రధాన ఆలయం:
ప్రస్తుతం శ్రీ కృష్ణ మందిరముగా పిలువబడుచున్న ఈ కృష్ణ మఠాన్ని కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది.
ప్రధాన ఆలయంలో ప్రవేశించగానే కుడివైపున ఒక కొనేరు కనిపిస్తుంది. దీనినే శ్రీ మద్వ తీర్ఢం అని పిలుస్తారు. ఉత్సవాల సందర్భముగా ఈ తీర్ధంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ తీర్ధం మధ్య భాగంలో గల మండపం నందు శ్రీ మద్వాచార్యుల విగ్రహం ఉంది. తీర్ధం దాటిన తరువాత భగీరధుని మండపం కలదు. ఎడమవైపున చెన్న కేశవ ఆలయం మందిరం ఉంది.
గర్బాలయానికి ముందు భాగంలో వెండి ధ్వజ స్తంభం కలదు. దానికి సమీపంలో తీర్ధ మండపం కలదు. ఇక్కడ స్వామి వారికి ఇష్టమైన అటుకుల పొడి తదితర సామాగ్రి ఉంచుతారు.
చెన్న కేశవ స్వామి ద్వారం నుండి ముందుకు వెళ్ళితే, గర్బాలయంలోని స్వామి వారిని నవ రంధ్రాలు ఉన్న కిటికీ గుండా దర్శించుకోవాలి. ఆలయం తూర్పు అభిముఖంగా ఉన్నప్పటికి, గర్బాలయంలో శ్రీ కృష్ణుని విగ్రహం పడమర అభిముఖంగా కిటికీ గుండా భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం ఆలయ పూజరులు అనుమతించని కారణంగా కనకదాసు అనే భక్తుడిని అనుగ్రహించుటకు గర్బాలయంలోని స్వామి వారు ఇలా వెనుకకు తిరిగి (పడమర వైపుకు) గవాక్షం (కిటికీ) ద్వారా దర్శనమిచ్చినట్లుగా చెపుతారు. ఆనాడు కనకదాసుకు దర్శనమిచ్చిన కిటికీ గుండా మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలి. వెండి తాపడంతో తయారుచేయబడిన ఈ కిటికీని ‘కనకనకిండి’ (అనగా కనకుని కిటికీ) అని పిలుస్తారు. కనకదాసు స్వామి వారిని ప్రార్ధించినచోట ఒక మండపాన్ని నిర్మించారు. దీనినే ‘కనకదాసు మండపం’ అని పిలుస్తారు. గర్భాలయం నందు నలుపు రంగు సాలిగ్రామతో తయారు చేయబడిన శ్రీ కృష్ణుని విగ్రహం నయన మనోహరంగా దర్శనిమిస్తుంది. స్వామి వారు ఒక చేతిలో కవ్వము మరియొక చేతిలో వేణువుతో బాల కృష్ణునిగా దర్శనమిస్తాడు.
గర్భాలయం వెలుపల ఇతర ఉపాలయాలు కలవు. శ్రీ కృష్ణ మందిరమునకు వెనుకగా అతి పురాతనమైన చంద్రమౌళీశ్వరాలయం ఉన్నది. అలాగే 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మింపజేసినట్లుగా భావిస్తున్న అనంతేశ్వర స్వామి ఆలయం దర్శించవచ్చును.
అష్ట మఠాలు:
ద్వైత మత ప్రచారంలో భాగంగా శ్రీ మద్యాచార్యులు శ్రీ కృష్ణ మఠానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులతో ఉడుపి కేంద్రంగా ఉడుపి చుట్టుప్రక్కల గ్రామలలో ఎనిమిది మఠాలను (అవి పేజావర, పుత్తగె, పలిమారు, అదమారు, సోదె, కాణియూరు, శీరూరు, కృష్ణాపుర) ఏర్పాటుచేయించెను. వీటినే అష్ట పీఠాలు అని పిలుస్తారు. శ్రీ కృష్ణ మందిరంలో అర్చన నిర్వహణ బాధ్యత ప్రతి రెండు సంవత్సరాలకు ఒక మఠం తరువాత మరొక మఠం వారు వంతుల వారిగా నిర్వహించేలా ఏర్పాటుచేసెను. ఈ సందర్బముగా జరిగే ఉత్సవాన్ని “పర్యాయ ఉత్సవం” అని పిలుస్తారు.
నిర్మాల్య అలంకరణ:
ప్రతి రోజు వేకువజామున నిర్మాల్య పూజ చేస్తారు. అప్పుడు స్వామి వారు ఎటువంటి అలంకారములు లేకుండా దర్శనమిస్తారు. ఈ దర్శనాన్నే విశ్వరూప దర్శనం అని అంటారు.
ఉడుపి వంటకాలు:
ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయానికే కాక మంచి వంటలకు కూడా ప్రసిద్ధి. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా వివిధ ప్రదేశాలలో కనపడుతుంటాయి. మధ్వ మతం వారు తయారు చేసే ఈ శాకాహార వంటకాలను శ్రీ కృష్ణుడి దేవాలయానికి నైవేద్యంగా అర్పిస్తుంటారు. ఈ వంటకాలు క్రమేణా ప్రసిద్ధి చెంది కర్ణాటక రాష్ట్రంలోనే కాక, దేశం యావత్తూ ప్రసిద్ధి గాంచాయి. ఉడుపి పేరుతో నేటికి ఉడుపి హోటళ్ళు చాలా చోట్ల వివిధ ప్రదేశాలలో కనపడుతూంటాయి.
స్థానిక ఇతర ఆకర్షణలు:
ఉడుపి లో శ్రీ కృష్ణ మందిరమే కాకుండా మరవంతె బీచ్, మల్పే బీచ్, కాపు బీచ్, దరియా బహదుర్గాద్ కోట, సెయింట్ మేరీస్ ఐల్యాండ్, కుడ్లు జలపాతాలు మొదలైనవి దర్శనీయ స్థలాలు.
వసతి మరియు భోజనం:
దేవస్థానం సత్రాలు బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతాసత్రాలలో విడిది చేయవచ్చు. ఉడుపి దేవస్థానంలో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇవే కాకుండా అత్యాధునిక వసతి సదుపాయాలు గల ప్రవేట్ హోటల్లు కలవు.
ఉడుపి కి ఎలా చేరుకోవాలి?
ఉడుపి క్షేత్రం మంగళూరు నుండి సుమారు 70 కి.మీ.ల దూరంలో బెంగళూరు నుండి సుమారు 500 కి.మీ.ల దూరంలో ఉంది. మంగుళూరు లేదా బెంగుళూరు నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి ఉడుపి కి చేరుకోవాడనికి రోడ్డు మార్గం ద్వారా అయితే సుమారు 913 కిలో మీటర్ల దూరంలో రైలు మార్గం ద్వారా అయితే సుమారు 1500 కిలో మీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి డైరెక్ట్ బస్సులు కలవు మరియు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుండి రైలు సదుపాయం ఉంది. తెలుగు రాష్టాల నుండి ధర్మస్థల దర్శించాలనుకొనే యాత్రికులు ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ నుండి బస్సు లేదా రైలు మార్గంలో ఉడుపి చేరుకోవడం సులభం.
రోడ్డు మార్గం:
కర్ణాటకలోని ముఖ్య నగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూర్ల నుండి KSRTC ఆద్వర్యంలో ఎ.సి., నాన్ ఎ.సి., డీలక్స్ బస్సులు డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
రైలు మర్గం:
ఉడుపి దేశంలోని ప్రధాన పట్టణాలతో రైలు మార్గం గుండా అనుసంధానమై ఉంది.
వాయు మార్గం:
ఉడుపి కి సమీపంలో మంగళూర్ నందు విమానాశ్రయం కలదు.
మరింత సమాచారము కొరకు:
శ్రీ కృష్ణ దేవస్థానం వారి ఫోన్ నెం. : 0820-2520598
శ్రీ కృష్ణ దేవస్థానం వారి వెబ్ సైట్: www.udipikrishnamutt.com
శ్రీ కృష్ణ దేవస్థానం వారి వెబ్ సైట్: www.udipikrishnamutt.com
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి